ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అందులో భాగంగా వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఏకవాఖ్య తీర్మానంతో వైఎస్ జగన్ ఎన్నికయ్యారు. ఈరోజు ఉదయం 10:31 గంటలకు ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే బొత్స సత్యనారాయణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ధర్మాన ప్రసాదరావు.. బుగ్గన.. సురేష్ తదితర నాయకులు తీర్మానాన్ని బలపర్చారు. దీంతో శాసనసభాపక్ష నేతగా జగన్మోహన్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్ గవర్నర్కు ఈ ప్రతిని అందజేయనున్నారు.