వైసిపి చీఫ్ జగన్ పై గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ రావు అనే యువకుడు జగన్ పై కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసులో శ్రీనివాస్ రావుకు బెయిల్ మంజూరైంది. ఈ క్రమంలో శ్రీనివాస్ రావు శనివారం జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రజా సమస్యలను జగన్ కు వివరించేందుకు ఆయన వద్దకు వెళ్లానని శ్రీనివాస్ రావు మీడియాకు తెలిపారు. అనుకోకుండా తన వద్ద ఉన్న కత్తి జగన్ భుజానికి తగిలిందని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. తాను కావాలని జగన్ పై దాడి చేయలేదని, తాను జగన్ కు అభిమానినని ఆయన పేర్కొన్నారు. దాడి అనంతరం అక్కడ ఉన్నవారు తనను కొడుతుంటే, జగన్ అడ్డుకున్నారని, తాను ఏ తప్పూ చేయలేదని శ్రీనివాస్ రావు తెలిపారు. పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. జగన్ సిఎం కావడం సంతోషంగా ఉందని, ఆయన వల్లనే తాను బతికి ఉన్నానని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.