విజయవాడ, ఆగస్ట్ 26 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకయ్య నాయుడుకు పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు తొలిసారి సొంతగడ్డలో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమాన౦లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్ వద్ద ఘన సన్మానం లభించింది. గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం భారీ ర్యాలీగా గన్నవరం నుంచి విజయవాడ బయలుదేరి వెళ్ళారు. ర్యాలీ డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో సాగుతుండగా దారి పొడవున ప్రజలు వెంకయ్యకు స్వాగతం పలికారు. వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ర్యాలీ ముగిసే వరకు ఇతర వాహనాలను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేసారు. అంతేకాకుండా భద్రతను కట్టుదిట్టం చేసి, గతంలో ఎన్నడు లేని విధంగా స్వాగత సత్కారాలు జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి వెలగపూడి వద్ద భారీ వేదిక ఏర్పాటు చేసారు.