టీచర్ పోస్టులు ,లెక్చరర్ పోస్టులు భర్తీ చేయలేదు: కెసిఆర్ పై మండిపడ్డ బీజేపీ నేత

SMTV Desk 2019-05-24 12:25:04  Laksman, KCR

సిఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో పుణ్యక్షేత్రాలకు సందర్శనకు బయలుదేరటాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తప్పు పట్టారు. ఆయన నిన్న హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుండగా, సిఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని, ప్రజలను గాలికొదిలేసి ప్రత్యేక విమానం వేసుకొని కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. ఐదేళ్ళ కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టి పోయింది. పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. కాలేజీలలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేయలేదు. యూనివర్శిటీలలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయలేదు. ఆ కారణంగా రాష్ట్రంలో విద్యావ్యవస్థ, అక్షరాస్యత అట్టడుగు స్థాయికి చేరుకొంది. గ్రామాలకు కనీసం బస్సు సౌకర్యం కల్పించకపోవడం వలన హాజీపూర్ వంటి ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 26 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటే కనీసం ఒక్క కుటుంబాన్ని పరామర్శించలేదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పేరుకుపోయుండగా సిఎం కేసీఆర్‌ కుటుంబాన్ని వెంటపెట్టుకొని తీర్ధయాత్రలు చేస్తున్నారు,” అని విమర్శించారు.