న్యూఢిల్లీ, ఆగస్ట్ 25: భారత రిజర్వ్ బ్యాంక్ చరిత్రాత్మక రూ. 200నోటును నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. నకిలీ నోట్లు రాకుండ, పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలు పడుతున్న చిల్లర కొరతను తీర్చాలనే ఉద్దేశ్యంతో విడుదల చేసిన ఈ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ నోటుపై సామాజిక మాధ్యమ వేదికగా వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నోట్ రంగు దోరగా వేయించిన దోశను తలపిస్తుందని, బాగా మరగబెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉందటూ ఎద్దేవా చేస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వం, హిందు ప్రభుత్వం కనుక వినాయక చతుర్థి రోజున కొత్త నోటు విడుదల చేసిందంటూ విమర్శిస్తున్నారు. మరికొందరైతే ప్రస్తుతం పప్పు ధర రూ. 200 పైబడింది, అందుకే రూ. 200 నోటును పప్పు రంగులో విడుదల చేశారంటున్నారు హాస్య పండితులు. మోదీ ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నోట్లు అమ్మాయిలకు ప్రియమైన రంగుల్లో ముంద్రిస్తున్నారు. మరి, అబ్బాయిల కోసం ఎప్పుడు ముద్రిస్తారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.