కొలంబో: పోయిన నెల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో దాదాపు 200 మంది చిన్నారులు తమ తల్లితండ్రులని కోల్పోయారని కొలంబోకు చెందిన శ్రీలంక రెడ్క్రాస్ సొసైటీ ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ప్రధాన ఆదాయ వనరులను కోల్పోయిన కుటుంబాలు తమ సాధారణ జీవితాలను కొనసాగించేందుకు అవసరమైన పొదుపు మొత్తాలను కూడా దాచుకోలేదని రెడ్క్రాస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. ఈస్టర్ పండుగ రోజున తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబో నగరంలోని మూడు చర్చ్లు, మూడు లగ్జరీ హోటళ్లపై దాడి చేసి దాదాపు 250 మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన దాదాపు 75 మందికి చెందిన కుటుంబాల జీవనాధారం దెబ్బతిన్నదని రెడ్ క్రాస్ సొసైటీ వివరించింది.