ఇస్తాంబుల్: ఇస్తాంబుల్ నగరపాలక సంస్థ ఎన్నికలను రద్దు చేయాలన్న అధ్యక్షుడు ఎర్డోగాన్ నిర్ణయాన్ని టర్కీ సుప్రీం సమర్ధించిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్షన్ కౌన్సిల్ (వైఎస్కె) నిర్ణయాన్ని టర్కీ కమ్యూనిస్టు పార్టీ మాత్రం నిరసించింది. ఎర్డోగాన్ నిర్ణయాన్ని సమర్ధించటం ద్వారా వైఎస్కె ప్రజల ఓటు హక్కును కాలరాసిందని ఒక ప్రకటనలో విమర్శించింది. గత మార్చి 31న పూర్తయిన ఎన్నికలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని దీర్ఘకాలం సాగదీసి చివరకు నిర్ధారించటం ద్వారా వైఎస్కె ఎర్డొగాన్ బలహీనతను వెల్లడించటంతో పాటు దేశంలో రాజకీయ సంక్షోభం మరింత పెరిగేందుకు దోహదపడుతుందని తెలిపింది. తమ ఇష్టం వచ్చిన వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకునే హక్కు ప్రజలకున్నదన్న విషయాన్ని అటు ఎర్డోగాన్తోపాటు ఇటు వైఎస్కె కూడా విస్మరించిందని వ్యాఖ్యానించింది.