పంత్ పవర్ హిట్టింగ్...కన్నీళ్లు పెట్టుకున్న సన్‌రైజర్స్ కోచ్

SMTV Desk 2019-05-09 19:04:36  rishab pant, srh coach, srh coach crying, srh vs dc, ipl 2019

వైజాగ్: నిన్న వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ హిట్టర్ రిషబ్ పంత్ మళ్ళీ తన సత్తా చాటాడు. పంత్ (49: 21 బంతుల్లో 2x4, 5x6) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి క్వాలిఫయర్-2లో దూసుకెళ్లింది. కేవలం 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ కు చేరిన హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో ఓడటం ద్వారా ఇంటి బాట పట్టింది. ఢిల్లీ ఛేదన సమయంలో.. చివరి 18 బంతుల్లో 34 పరుగులు అవసరమగా.. బసిల్ థంపీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ భారీ షాట్లు ఆడిన పంత్ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు. కళ్లముందే మ్యాచ్ చేజారుతుండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్ టామ్ మూడీ స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. మార్టిన్ గప్తిల్ (36: 19 బంతుల్లో 1x4, 4x6), మనీశ్ పాండే (30: 36 బంతుల్లో 3x4) మినహా.. టాప్ లార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు తేలిపోవడంతో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేదనలో పృథ్వీ షా (56: 38 బంతుల్లో 6x4, 2x6), రిషబ్ పంత్ (49: 21 బంతుల్లో 2x4, 5x6) చెలరేగడంతో ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే 165/8తో ఛేదించేసింది. గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తాజా ఓటమితో టోర్నీ నుంచి హైదరాబాద్ నిష్క్రమించగా.. ఢిల్లీ జట్టు శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఆదివారం రాత్రి ఉప్పల్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో ఫైనల్లో ఢీకొననుంది. ఇప్పటి వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.