పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తాం: రాహుల్ గాంధీ

SMTV Desk 2019-05-09 19:01:05  petrol, diesel, rahul gandhi, aicc president

ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సామాన్యుడికి ఊరటనిచ్చేందుకు పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై ఆయన మండిపడ్డారు.

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన మోదీ మరోసారి ప్రధాని కాలేరని అన్నారు. కాపలాదారుడే దొంగ అని తాను కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ అనలేదని... మోదీ చేతిలో మోసపోయిన రైతులు, యువతే ఆ విధంగా నినదిస్తున్నారని చెప్పారు.

నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ మండిపడ్డారు. దొంగలంతా మోదీ సాయంతో నల్లధనాన్ని మార్చుకున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాఫెల్ డీల్ పై విచారణ జరిపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన న్యాయ్ (కనీస ఆదాయ పథకం)కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.