ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీల మధ్య ఈ రోజు కీలక సమావేశం జరిగింది. న్యూఢిల్లీలోని లాటర్స్ రెసిడెన్సీలో భేటీ అయ్యారు. సుమారు అర గంటపాటు సాగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంగా వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశంపై ప్రధానంగా చర్చించారని సమాచారం. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ వైఖరిపై తదుపరి ఎలా ముందుకెళ్లాలనే విషయమైన రాహుల్తో చంద్రబాబు చర్చించారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఈవీఎంలు, వీవీప్యాట్ల విషయంలో ఈసీని తప్పుబడుతోన్న ప్రతిపక్షాలు, తదుపరి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు ముగిసిన సాధారణ ఎన్నికల ఐదు దశల పోలింగ్పై కూడా చర్చించినట్టు చెబుతున్నారు. ఒకవేళ యూపీఏకు మెజారిటీ రాకుంటే తటస్థులను కలుపుకునిపోయే విషయమై కూడా రాహుల్, చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈ సమావేశం అనంతరం చంద్రబాబు కోల్ కతా బయలుదేరి వెళ్లారు. అక్కడ ఈరోజు ఖరగ్ పూర్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.