న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యుఎన్ఎస్సి) ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ వంటి దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలని ఫ్రాన్స్ దౌత్య ప్రతినిధి పేర్కొన్నారు. అలాగే ఈ దేశాలను శాశ్వత సభ్యులుగా చేయడంలో ఫ్రాన్స్ వ్యూహాత్మక ప్రాధాన్యాలలో ఇది కూడా ఒకటని వెల్లడించారు. భద్రతామండలిలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సంస్కరణల అమలుకు సమితిని గట్టిగా కోరుతూ ప్రయత్నిస్తున్న దేశాల్లో ఇండియా ముందుంది. కాబట్టి భారతదేశానికి శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వడం తప్పనిసరి అని ఫ్రాన్స్ పేర్కొంది. ‘విధానపరంగా చూస్తే భద్రతా మండలిని విస్తృతపరిచేందుకు కలిసి పనిచేయడానికి ఫ్రాన్స్, జర్మనీలకు బలమైన విధానమే ఉంది. అందుకు అవసరమైన చర్చలు ఫలవంతం కావడానికి కృషిచేసే సామర్థం కూడా ఉంది. మండలి విస్తరీకరణతో ఆ ప్రభావం ప్రపంచం మీద పడుతుంది. పరిస్థితులు మెరుగవుతాయి. ఇందులో సందేహం లేదు’ అని ఐక్యరాజ్యసమితిలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి ఫ్రాంకోయిస్ డిలాట్రే విలేకరులకు చెప్పారు.