అక్షయ తృతీయ.....రికార్డు స్థాయిలో బంగారం అమ్మకాలు!

SMTV Desk 2019-05-08 12:21:31  gold saling in akshaya tritiya

హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో బంగారం అమ్ముడు పోయింది. దీంతో పసిడి వ్యాపారులకు సెంటిమెంట్ బాగానే కలిసొచ్చింది. మంగళవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 350 కిలోల బంగారం విక్రయాలు జరిగితే.. ఒక్క హైదరాబాద్‌లోనే 280 కిలోల బంగారు ఆభరణాల అమ్మకం జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా మంచిరోజులు, మంచి ముహూర్తాల సెంటిమెంట్లు పల్లెటూర్లలోనే ఎక్కువగా ఉంటాయి. కానీ అక్షయ తృతీయ రోజు మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఆరోజు బంగారం కొంటే మంచిదన్న ప్రచారం ఉండటంతో పట్టణ, నగరవాసులు పోటీపడి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అక్షయ తృతీయ రోజు ఉదయం 8.30 గంటలకు బంగారం కొనుగోలు చేస్తే మంచిదంటూ ప్రచారం జరగడంతో మంగళవారం ఉదయాన్నే కొనుగోలుదారులు షాపులకు క్యూ కట్టారు. ప్రీ బుకింగ్ చేసుకున్నవారు సైతం అదే సమయానికి తీసుకునేందుకు మొగ్గు చూపినట్లు వర్తకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సాధారణ రోజుల్లో 80-90 కేజీల బంగారం విక్రయాలు జరుగుతుంటాయని, అక్షయ తృతీయ పురస్కరించుకుని 250-280 కిలోల విక్రయాలు జరగిందని వ్యాపారులు తెలిపారు.