ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టుకు అసలు కార్యరూపం తీసుకు వచ్చింది దివంగత వైఎస్ఆర్ అని అన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు కాసుల కక్కుర్తే కారణమని వివరించారు. ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటైన వెంటనే పోలవరాన్ని పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
అదేవిధంగా పర్యవరణ, ఇతర అనుమతులను వైఎస్ఆర్ హయాంలోనే 4,500 కోట్లు ఖర్చు చేశారని.. 2019 కల్లా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆయన మండిపడ్డారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పట్టిసీమను నిర్మించారని బొత్స విమర్శించారు. పోలవరం అంచనాల వ్యయాన్ని రూ.16వేల కోట్ల నుంచి 55వేల కోట్లకు పెంచారని తీవ్ర స్థాయిలో బొత్స ధ్వజమెత్తారు. 2019లో గ్రావిటీ ద్వారా నీరందిస్తామని తప్పుడు మాటలు చెప్పిన టీడీపీ నేతలు.. ప్రజలను మోసం చేశారని.. ఇప్పుడు 2020 వరకు నీరు ఇవ్వడం సాధ్యంకాదని చెప్తున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.