వైసీపీకి 110 స్థానాలు.. జోస్యం చెప్పిన బీజేపీ నేత

SMTV Desk 2019-05-08 12:12:32  YCP, Bjp netha,

ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు. అందులో ఒకరు అయితే ఏకంగా వైసీపీ గెలుస్తుంది అని లెక్కలు చెప్పేశారు, ఆయనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలపై బీజేపీ నేత మురళీధర్ రావు స్పందించారు. వైసీపీకి 110 స్థానాలు దక్కడం ఖాయమని అభిప్రాయపడ్డారు. తద్వారా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది వైసీపీనే అని చెప్పకనే చెప్పారు. ఈ ఎన్నికలతో టీడీపీ ప్రస్థానం ముగుస్తుందని, ఎన్డీయేలో కూడా చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తిరిగి ఎన్డీఏలోకి వచ్చే అవకాశమే లేదని దేశంలో బీజేపీ సర్కార్ మరోమారు అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించబోవని మురళీధర్ రావు పేర్కొన్నారు. దేశంలో ప్రధాని మోదీపై వ్యతిరేకత ఏమీ లేదని, మోదీ ప్రభంజనంతో గతంలో కంటే ఈసారి బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. ప్రత్యర్థి కూటములలోని అసమ్మతివాదుల మద్దతు బీజేపీకే ఉందని ఆయన వెల్లడించారు. అయితే, ఏపీ, తెలంగాణల్లో బీజేపీకి తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చినా ఆ నష్టాన్ని తమిళనాడులో అత్యధిక సీట్లు గెలవడం ద్వారా భర్తీ చేసుకుంటామని చెప్పుకొచ్చారు.