ముంబై, ఆగస్ట్ 24 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రూ.200 నోటు శుక్రవారం చలామణిలోకి రానుందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అక్రమ౦గా చలామణి అవుతున్న నగదు, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేసేందుకు రూ. 200 నోటును ముద్రించనున్నట్లు ఆర్బీఐ గతంలోనే తెలిపింది. అయితే ఈ నోటును రేపటి నుంచే అమలులోకి తీసుకురానున్నారు. పసుపు రంగులో ఉన్న ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం, నోటు వెనుక భాగాన భారతదేశ అత్యున్నత సాంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. అయితే దేశంలో నల్లధనం, పెద్ద మొత్తంలో అక్రమ నిల్వల వంటి వాటికి కళ్లెం వేసే దిశగా ఇదివరకే ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసారు. ఇప్పుడు తాజాగా చలామణిలోకి రానున్న ఈ నోటు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం విడుదల చేయనున్న 200 వందల నోటుపై ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా దాదాపు చిల్లర కష్టాలు తగ్గుముఖం పట్టే అవకాశ౦ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.