ఆ స్కూల్‌లో ఫీజు కట్టనక్కర్లేదు.. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే చాలు!

SMTV Desk 2019-05-08 11:56:21  private school, school fees, tata institue of social sciences

ప్రైవేట్ పాఠశాల అంటే.. వెంటనే గుర్తుకొచ్చేది ఫీజులు. చదువు మాట ఎలా ఉన్నా.. ఫీజులు వసూళ్లలో మాత్రం పక్కగా ఉంటాయి. అయితే, అస్సాంలోని ఓ పాఠశాల మాత్రం స్కూల్ ఫీజులను తీసుకోవడం లేదు. నగదుకు బదులుగా ప్టాస్టిక్ వ్యర్థాలను ఇస్తే చాలని చెబుతోంది. విద్యార్థులు, గ్రామస్థుల్లో పర్యావరణంపై అవగాహన కలిగిస్తోంది.

2013లో ఓ స్కూల్ ప్రాజెక్ట్ కోసం న్యూయార్క్ నుంచి ఇండియాకు వచ్చిన మంజీన్ ముక్తార్.. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) సోషల్ వర్క్ స్టూడెంట్ ప్రతిమ శర్మను కలిశారు. ఇద్దరు మూడేళ్లపాటు శ్రమించి 2016లో అక్షర్ అనే పాఠశాలను ప్రారంభించారు.

చలికాలంలో అస్సాం ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను మండించడం చూసి మంజీన్, ప్రతిమ ఆశ్చర్యపోయారు. అలా చేయడం ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్రమాదకరమని గ్రామస్థులకు తెలిపారు. ఈ సందర్భంగా అక్షర్ లో చదివే విద్యార్థులు ఫీజులు చెల్లించకుండా తమ ఇంట్లో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తే చాలని ప్రకటించారు.

ఈ సందర్భంగా మంజీన్ మాట్లాడుతూ...... "ఇక్కడ చాలామంది పిల్లలు పనులు చేస్తూ ఇంటికి ఆధారంగా ఉన్నారు. దీంతో, వారిని స్కూల్‌కు పంపించాలని కోరడం పెద్ద సవాలుగా ఉండేది. ఇక్కడి పిల్లలంతా క్వారీల్లో దయనీయ పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా స్కూల్ నిబంధనలను రూపొందించాం. ప్లాస్టిక్ వ్యవర్థాలను నిర్మాణ సామాగ్రి మార్చేలా రీసైకిలింగ్ విధానాన్ని గ్రామస్థులకు నేర్పించాం. ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్‌కు తీసుకురావాలని పిల్లలను కోరాం. మొదట్లో ఈ స్కూల్‌లో 20 మంది విద్యార్థులే ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 100కు చేరింది" అని తెలిపారు.