పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని ఇమ్రాన్ గుర్తు చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. భారత ఉపఖండానికి చెందిన చరిత్రపై ఇమ్రాన్ కు నిజమైన ఆసక్తి ఉందని చెప్పారు. చరిత్రను ఆయన బాగా చదువుతారని అన్నారు. అయితే, ఒక భారతీయ ధీశాలి వర్ధంతిని ఒక పాకిస్థాన్ నేత స్మరించుకోవలసి రావడమే తనకు నిరాశను కలిగించిందని చెప్పారు.
ఈ నెల 4వ తేదీన టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా ఇమ్రాన్ ఆయనను గుర్తు చేసుకున్నారు. బానిసగా బతకడం కంటే స్వతంత్రంగా ఉండటమే గొప్ప అని టిప్పు సుల్తాన్ భావించారని... ఆ లక్ష్యంతోనే చివరి వరకు పోరాడుతూ ప్రాణాలు విడిచారని కితాబిచ్చారు. తాను టిప్పు సుల్తాన్ ను ఆరాధిస్తానని చెప్పారు.