50 కోట్లిస్తే మోదీని చంపేస్తా: మాజీ జవాను తేజ్ బహదూర్

SMTV Desk 2019-05-07 12:34:29  ex jawan, tej bahadur, congress, sp bsp candidate, varanasi

ప్రధాని నరేంద్రమోదీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్‌‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు పెను సంచలనమైంది. తనకు రూ. 50 కోట్లు ఇస్తే ప్రధాని నరేంద్రమోదీని చంపేస్తానని బహదూర్ అందులో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తేజ్ బహదూర్ సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అతడి దరఖాస్తును ఈసీ తిరస్కరించింది.

రెండేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్ బహదూర్ అంగీకరించాడు. అయితే, దీని వెనక కుట్ర ఉందని బహదూర్ ఆరోపించాడు. ఓ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు ఉన్న ఈ వీడియోలో తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని బహదూర్ అనడం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే, వీడియో రెండేళ్లనాటిది కావడంతో దాని విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వెనక ఉన్నది కాంగ్రెస్సేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మోదీపై నామినేషన్ వేసిన వ్యక్తే ఆయన హత్యకు కుట్ర పన్నడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మోదీని ఎదుర్కోలేకే ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి హింసా మార్గాలను ఎంచుకుంటున్నాయని ఆరోపించారు.