కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళతో సిరిసేన సర్కార్ అత్యంత అప్రమత్తమైంది. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ అనుబంధ సంస్థ ప్రకటించుకుంది. ఈనేపథ్యంలో ఐఎస్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ఆరోపణలపై 200 మంది మత బోధకులను దేశం నుంచి బహిష్కరించనున్నట్టు శ్రీలంక హౌంమంత్రి వజీరా అబీరువర్దేనా తెలిపారు. శ్రీలంకలో మరిన్ని పేలుళ్లు జరిగే అవకాశముందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన నేపథ్యంలో తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అన్నారు. వీసాల జారీ విషయంలోనూ కఠినతరమైన నిబంధనలను అనుసరిస్తామని అన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలతో తమ దేశానికి వచ్చినవారిని కూడా అనుమానించాల్సి వస్తున్నదని అన్నారు.200 మంది ముస్లిం మత బోధకులను దేశ బహిష్కరణ చేయనున్నట్టు శ్రీలంక చేసిన ప్రకటనతో ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. వీరితో పాటు మరో 400 మంది విదేశీయులను కూడా బహిష్కరించనున్నట్టు పేర్కొంది. బహిష్కరణకు గురైన విదేశీయుల్లో బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు, పాకిస్థాన్ దేశీయులు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, శ్రీలంక భద్రతా బలగాలు, బాంబు స్క్వాడ్, పోలీసులు దేశంలోని అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.