ఐపీఎల్ 2019 సీజన్లో ప్లేఆఫ్స్ కి చేరుకున్న మూడో జట్టు ముంభై ఇండియన్స్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. సీజన్ ప్రారంభంలోనే భారీ స్కోర్లు అందించిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత బౌలింగ్లోనూ వికెట్లు పడగొడుతూ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగాకి అండగా నిలుస్తున్నాడు. దీంతో.. లీగ్ దశలో కొన్ని మ్యాచ్ల్లో నామమాత్రపు స్కోర్లు చేసినా.. ముంబయి జట్టు విజయాల్ని అందుకోగలిగింది. తాజా సీజన్లో 14 మ్యాచ్లాడిన హార్దిక్ పాండ్య 380 పరుగులు చేయడమే కాకుండా.. బంతితోనూ చెలరేగి 14 వికెట్లు పడగొట్టాడు. కోల్కతాతో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లోనూ హార్దిక్ పాండ్య బంతితో సత్తాచాటి ప్రమాదకర ఓపెనర్ క్రిస్లిన్ (41: 29 బంతుల్లో 2x4, 4x6)తో పాటు ఇటీవల హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చిన శుభమన్ గిల్ (9)లను వరుస ఓవర్లలో ఔట్ చేసేశాడు. దీంతో.. ఒత్తిడికి గురైన కోల్కతా 133/7కే పరిమితమవగా.. లక్ష్యాన్ని మరో 23 బంతులు మిగిలి ఉండగానే ముంబయి 134/1తో ఛేదించేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన కోల్కతా ఇంటిబాట పట్టగా.. ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. మొత్తంగా మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 20 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.