ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యాన్ని ఏలిన టిప్పు సుల్తాన్కు నివాళి అర్పించారు. ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుతూ... ఈరోజు మే 4వ తేది. ఇది టిప్పు సుల్తాన్ వర్ధంతి రోజు. బానిసగా జీవించడం కన్నా స్వేచ్ఛకోసం, ఆ స్వేచ్ఛను పొందడం కోసం చేసే పోరాటంలో చావడం కోసం ప్రాధాన్యమిచ్చిన రాజు టిప్పు సుల్తాన్ అని ఖాన్ తన ట్విట్టర్ పోస్ట్లో కొనియాడారు. ఇమ్రాన్ ఖాన్ టిప్పు సుల్తాన్ ధైర్యసాహసాలను శ్లాఘించడం ఇదే మొదటిసారి కాదు. జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జైషే ఎ మహ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తరువాత భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో నిర్వహించిన పాకిస్తాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలోనూ ఇమ్రాన్ ఖాన్ టిప్పు సుల్తాన్ ధైర్య సాహసాలను ప్రశంసించారు.