విజయవాడ: ఆదివారం విజయవాడలో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపిలో ఎన్నికలు అయిపోగానే వైఎస్ఆర్సిపి అధినేత జగన్ విహారయాత్రకు వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. ఫణి తుపాను ప్రభావంతో ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పనిచేశారనీ, నష్టాన్ని తగ్గించగలిగారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయాలన్న ఏకైక తపన ఉన్న నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు.జగన్ వ్యవహారశైలితో ఆ పార్టీ మద్దతుదారులు బాధపడుతున్నారనీ, తాము వైఎస్ఆర్సిపి కి ఎందుకు ఓటేశామా? అని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 70 ఏళ్ల వయసులో కూడా ప్రజలకు ఏదో చేయాలనే ఆరాటం చంద్రబాబుదేనని కొనియాడారు.