కర్నూలు: కర్నూలు జిల్లా బసపురంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. తండ్రి మరణ వార్త విని కొడుకు చనిపోయాడు. బసపురంలో నివాసముండే బిసయ్య, శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. చిన్న కొడుకు ఓబులేసు తల్లితండ్రులతోనే ఉంటున్నాడు. తండ్రి అంటే చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. తండ్రి చనిపోవడం తట్టుకోలేని ఓబులేసుకు గుండెపోటు వచ్చింది. అంతే… ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన అక్కడే కన్నుమూశాడు. తండ్రీ, కొడుకు ఇద్దరు ఒకే రోజు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను వారిని తీవ్రంగా కలిచివేసింది.