ఫణి తుఫాను దానికి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న హిమాలయా పర్వతాల్లో కూడా ప్రభావం చూపుతుంది. ఫణి కారణంగా వీస్తున్న బలమైన గాలులకు ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపులో ఉన్న సుమారు 20 టెంట్లు ఎగిరిపోయాయి. మరికొన్ని పాడైపోయాయి. ఈ సందర్భంగా నేపాల్ ప్రభుత్వం టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. టూరిస్టుల భద్రత పట్ల ట్రెక్కింగ్ ఏజెన్సీలు, వారి సపోర్ట్ స్టాఫ్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. బలమైన గాలుల వల్ల కొన్న టెంట్లు ఎగిరిపోయాయనే సమాచారం అందిందని, అయితే పర్వతారోహకులు, సపోర్ట్ స్టాఫ్ అందరూ క్షేమంగానే ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖకు అనుబంధంగా ఉండే పర్వతారోహక విభాగం డైరెక్టర్ ఆచార్య తెలిపారు. పరిస్థితి మెరుగుపడేంత వరకు అందరూ సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండిపోవాలని కోరారు.