బెంగళూరు: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడిన మ్యాచ్ లో బెంగుళూరు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం హైదరాబాద్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యర్థి ముందు చెప్పుకోదగ్గ లక్ష్యం నిర్దేశించాం. అయితే, ఈ మ్యాచ్లో మరో 15 పరుగులు చేసి ఉంటే బాగుండేది. ఆర్సీబీ బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడారు. మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. గత రెండు మ్యాచుల్లోనూ చివరి వరకూ పోరాడి ఓడాం. టీ20 క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. క్షణాల్లో ఫలితాలు తారుమారు అవుతూ ఉంటాయి. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే అని విలియమ్సన్ పేర్కొన్నాడు.