శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన భారత్లోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ ఘటనతో భారత్ లో ఐసిస్ మూలాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని కొలంబో ఆత్మాహుతి దాడులు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంక రాజధానిలో ఈస్టర్ సందర్భంగా దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ నిమిత్తం భారత్లోని కేరళ, బెంగళూరు, కశ్మీర్కు వచ్చివెళ్లినట్లు శ్రీలంక లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేననాయకే ప్రకటించడం సంచలనంగా మారింది. కొలంబో దాడులకు ముందు వారు భారత్ వెళ్లారని అక్కడ బెంగళూరు, కేరళ, కశ్మీర్లో కొంత కాలం ఉన్నట్లు మావద్ద సమాచారం ఉందని, బహుశా వాళ్లు శిక్షణ కోసం వెళ్లి ఉండవచ్చని లేదా ఐసిస్ తరఫున ఇతర ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు పెంచుకునే నిమిత్తం వెళ్లి ఉండవచ్చని ఆయన ప్రకర్తించారు. ఈ మధ్య కాలంలో తమిళనాడు, కేరళలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. పలువురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం సేననాయకే వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తోంది. నిజానికి కొలంబోలో ఉగ్రదాడులకు ఆస్కారం ఉందని శ్రీలంక ప్రభుత్వాన్ని భారత్ దాడులకు కొద్ది గంటల ముందే హెచ్చరించింది. భారత్ కస్టడీలో ఉన్న ఐసిస్ సానుభూతిపరుడు తెలిపిన వివరాల మేరకు ఎన్ఐఏ శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించింది.