దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో ఉంటున్న భారతీయుడికి రూ. 27 కోట్ల జాక్ పాట్ లభించింది. అబుధాబిలో జరిగిన ఒక రాఫిల్ డ్రాలో షోజిత్ కెఎస్ ఈ నగదు గెలుచుకున్నారు. ఎమిరెట్స్లో అదృష్టం వరించిన భారతీయుల జాబితాలో ఇప్పుడు షోజిత్ కూడా చేరారు. షార్జాలో నివసిస్తున్న షోజిత్ ఏప్రిల్ 1న అబుధాబి రాఫిల్ టిక్కెట్ కొన్నారు. కానీ తనను అదృష్టం వరించిందని, కోటీశ్వరుడిని అయ్యానని షోజిత్కు తెలీదు. ఆయన కొన్న టిక్కెట్కు లాటరీ తగిలిందని అధికారులు ఫోన్ చేసినా షోజిత్ వాటిని తిరస్కరించారు. ‘షోజిత్తో మాట్లాడేందుకు నిరంతరం ఫోన్లో ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంతప్రయత్నిస్తున్న మాకు ఫోన్లో దొరక్కుంటే ఇంక ఆయనింటికే వెళతాం. షార్జాలో ఆయన ఎక్కడ ఉండేదీ మాకు తెలుసు’ అని అబుధాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రతి నెలా బిగ్ టిక్కెట్ రాఫిల్ నిర్వహిస్తున్న రిచర్డ్ ఖలీజ్ టైమ్స్కు తెలిపారు. మరో ప్రవాస భారతీయుడు మంగేష్ మయిండే ఈ డ్రాలో బిఎండబ్లూ 220ఐ కారును గెలుచుకున్నారు. మరో ఎనిమిది మంది భారతీయులు, ఒక పాకిస్థానీయుడికి కన్సొలేషన్ బహుమతులు వచ్చాయి.