ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీలు ప్రధాని మోడీ స్వంత ఆస్తులు కావని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. త్రివిధదళాలను ప్రధాని మోడీ తన వ్యక్తిగత ఆస్తులుగా భావిస్తున్నారని రాహుల్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. యుపిఎ పాలన సమయంలో సర్జికల్ దాడులు చేశామంటే, అవి వీడియోగేమ్లో జరిగాయని మోడీ దేశ ఆర్మీని అగౌరపరిచారని రాహుల్ అన్నారు. నిరుద్యోగం ఇప్పుడు దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు.
మోడీ సర్కార్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి ఏమైయ్యాయని రాహుల్ ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి కానీ, రైతుల గురించి కానీ మోడీ ఏమీ మాట్లాడడం లేదని ఆయన మండిపడ్డారు. చౌకీదార్ చోర్హై అన్న వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పినట్టు రాహుల్ అంగీకరించారు. కానీ ఆ వ్యాఖ్యల పట్ల బిజెపికి మాత్రం క్షమాపణలు చెప్పబోనని తేల్చిచెప్పారు. ”చౌకీదార్ చోర్ హై అన్నది మా నినాదం”గా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. మసూద్ అజర్పై కఠిన చర్యలు తీసుకోవాలని… కానీ అతన్ని ఎవరు విడిచి పెట్టారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.