బ్యాంకాక్: నేడు థాయ్లాండ్ రాజు మహా వజిరలోంగ్ కార్న్ పట్టాభిషేకం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు నేటి నుండి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకలో భాగంగా తొమ్మిది అంచెల గొడుగు కింద రాజును కూర్చోబెట్టి ఆయన శిరస్సుపై భారీ బంగారు కిరీటాన్ని ధరింపచేశారు. ఆ కిరీటం సుమారు 7.3 కిలోల బరువు ఉంటుందని రాజదర్బారు వారు వెల్లడించారు. ఈ కిరీటం క్వీన్ ఎలిజబెత్ కిరీటం కన్నా ఏడు రెట్లు బరువైనదట. ఇవాళ ఉదయం బౌద్ధ, బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం రాజు వజిరాలాంగ్కార్న్ పట్టాభిషేకం మొదలైంది. బంగారంతో తయారుచేసిన పాదరక్షలను ఆయనకు తొడిగారు. అంతకుముందు బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం పవిత్ర జలంతో రాజుకు మంగళస్నానం చేయించారు. బ్యాంకాక్ వీధులన్నీ జనసంద్రంగా మారాయి.