ఆరో దశ పోలింగ్ లో అత్యంత ధనవంతుడు

SMTV Desk 2019-05-04 12:32:02  elections, ls polls, richest politician, congress leader,

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ మే 6న జరుగుతుండగా, ఆరో దశ పోలింగ్ మే 12న జరగనుంది. ఆరో దశ పోలింగ్ లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 374 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. గుణ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆరో దశ పోలింగ్ బరిలో ఉన్న 967 మంది అభ్యర్థుల్లో ఈయనే అత్యంత సంపన్నుడు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా సింధియా వ్యవహరిస్తున్నారు.

ధనవంతుల జాబితాలో క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 147 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ఆరో దశలో పోటీ పడుతున్న 54 మంది బీజేపీ అభ్యర్థుల్లో 46 మంది.. 46 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 37 మంది, 49 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో 31 మంది.. 12 మంది ఆప్ అభ్యర్థుల్లో ఆరుగురు.. 307 మంది ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో 71 మంది ఆస్తుల విలువ రూ. కోటి కంటే ఎక్కువగా ఉంది. మొత్తమ్మీద చూస్తే ఆరో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సరాసరి ఆస్తుల విలువ రూ. 3.41 కోట్లుగా ఉంది. 10 మంది అభ్యర్థులు తమకు చదువు రాదని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

ఆరో దశలో మొత్తం 59 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 83 మంది మహిళలు ఎన్నికల బరిలో ఉన్నారు.