సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో అప్ డేట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఎఫ్బీ మరికొద్ది రోజుల్లో సరికొత్త లుక్తో, ఆకర్షణీయంగా వస్తున్నట్టు వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ప్రతియేటా నిర్వహించే వార్షిక సాంకేతిక సదస్సులో ‘ఎఫ్8’ పేరిట జరుగిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని స్పష్టంచేశారు. సంస్థ ఈ కొత్త ఫేస్బుక్ డిజైన్ను ‘ఎఫ్బీ5’గా వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు వున్న నీలి రంగును కూడా మార్చుతున్నట్టు చెప్పారు. నీలిరంగు స్థానంలో తెలుపు రంగు వుంటుందని అన్నారు. యూజర్లకు మరింత సులువుగా, స్పీడ్గా ఫేస్బుక్ను వాడుకునేలా కొత్త ఫీచర్ ఉంటుందని అన్నారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేస్తామని, డెస్క్టాప్ సైట్లకూ మారుస్తామన్నారు. సీక్రెట్ క్రష్ పేరిట కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నామని.. ఇది తప్పకుండా తమ యూజర్లకు బాగా నచ్చుతుందని వెల్లడించారు. డేటా ప్రైవసీ, యూజర్ల సమాచారం భద్రతపై దృష్టిని సారించామన్నారు. మెసింజర్ యాప్ను మరింత తేలికగా మారుస్తున్నట్టు తెలిపారు. ఇండియాలో తాము పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన వాట్సాప్ పేమెంట్ ఫీచర్ను డిసెంబర్ నాటికి మరికొన్ని దేశాల్లో ప్రవేశపెడతున్నట్టు తెలిపారు.