బ్యాంకాక్, మే 02: థాయ్లాండ్ రాజు మహా వజిరాలాంకోర్న్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత అంగరక్షకురాలిగా ఉన్న మహిళను పెళ్లి చేసుకొని.. ఆమెను రాణిగా ప్రకటించి అందరిని విస్మయ పరిచారు. త్వరలోనే అధికారికంగా ధాయ్లాండ్ రాజు పట్టాభిషక్తుడు కానున్న నేపథ్యంలో తన వ్యక్తిగత రక్షణ దళం డిప్యూటీ అధిపతిగా ఉన్న సుతిదా తిజయ్(40)ను రాజు బుధవారం పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు రాజభవనం ఒక గెజిట్ను విడుదల చేసింది. ఈ వివాహ వేడుక వీడియోను కూడా విడుదల చేసింది.
థాయ్లాండ్ రాజ్యాంగ బద్ధమైన చక్రవర్తిగా 70 ఏళ్లపాట సింహాసనం అధిష్టించిన తండ్రి భూమిబోల్ అదుల్యదెజ్ 2016 అక్టోబర్లో మరణించడంతో ఆయన వారసుడిగా కింగ్ రామX పేరొందిన వజిరాలాంకోర్న్ (66) పగ్గాలు చేపట్టారు. వచ్చే శనివారం బ్యాంకాక్లో బౌద్ధ, బ్రాహ్మణ సంప్రదాయ వేడుకల ప్రకారం ఆయన థాయ్లాండ్ రాజుగా పట్టాభిషక్తుడు కానున్నారు. ఆ మరునాడు అధికారికంగా ఆయన రాజుగా ఊరేగింపులో పాల్గొంటారు.
గతంలో ఫ్లయిట్ అటెండెంట్గా పనిచేసిన సుతిదాను 2014లో వజిరాలాంకోర్న్ తన బాడీగార్డు విభాగంలో కమాండర్గా నియమించుకున్నారు. రాజుతో సుతిదా ప్రణయ కలాపాలు సాగిస్తున్నట్టు గతంలో పరిశీలకులు, విదేశీ మీడియా కథనాలు ప్రచురించినప్పటికీ.. రాజభవనం ఆ వ్యవహారాన్ని ఎప్పుడూ ధ్రువీకరించలేదు.