హైదరాబాద్: తెలంగాణ భవన్లో ఈ రోజు చెన్నూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యె బాల్క సుమన్ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై తెవేర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇంటర్మీడియట్ఫలితాల్లో దొర్లిన తప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ రాజకీయ టెర్రరిస్ట్.. రాష్ట్రంలో ఒక శాడిస్టుగా మారాడని సుమన్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి శంకరాచార్యులకు, పీర్ల పండుగకు ముడి పెడుతడు. మోకాలికి, బొడిగుండుకు ముడిపెడుతడు. ఇంటర్మీడియట్ బోర్డు అంశంలో గ్లోబరినా సంస్థకు అవకాశం ఎలా వచ్చిందని రేవంత్ అడుగుతున్నాడు. ఇంటర్మీడియట్ బోర్డు 25092017 నాడు టెండర్ పిలిస్తే ఎల్1 సంస్థగా గ్లోబరినా సంస్థ వచ్చింది. 27092017న టెండర్ ఫైనల్ అయింది. ఆ మొత్తం కాంట్రాక్ట్ వాల్యూమ్ కూడా రూ. 4 కోట్ల 35 లక్షల 70 వేలు మాత్రమే. అయితే ఈ కాంట్రాక్ట్ మూడేండ్ల వరకే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రాసెస్ను మొత్తం ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పజెప్పి వెళ్లిపోవాలి. ఇది పూర్తిగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో ఐటీ డిపార్ట్మెంట్కు ఏం సంబంధం? అని రేవంత్ను సుమన్ ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్నోడో ఎవడైనా మాట్లాడే మాటలేనా? అని ఆయన మండిపడ్డారు.