హైదరాబాద్, మే 01: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తరువాత హాస్య కథానాయకుడిగా తెలుగు తెరపై సందడి చేసిన ఘనత అల్లరి నరేష్ కే చెందింది. ఆనతి కాలంలోనే తన సినిమా జీవితంలో 50 చిత్రాలను పూర్తి చేశాడు. అలాంటి అల్లరి నరేశ్ కి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దాంతో ఆయన సరైన కథకోసం వెయిట్ చేస్తూనే, కీలకమైన పాత్రలను సైతం చేయడానికి రంగంలోకి దిగాడు.
ఇటీవల మహర్షి సినిమాలో మహేశ్ బాబు స్నేహితుడిగా నటించాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం....నరేష్ తదుపరి చిత్రం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఉండబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అంతే కాకుండా....ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ అని .. ఇందులో మరో హీరో కూడా చేయనున్నాడని చెబుతున్నారు.
ఈ విషయపై ఇప్పటివరకు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గాని, అల్లరి నరేష్ గాని స్పందించకపోవడం గమనించదగిన విషయం. మహర్షిలో నటించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తే ఇక నరేష్ కి హీరో పాత్రలే కాకుండా కీలక పాత్రల్లో నటించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు.