న్యూఢిల్లీ: భారత క్రీడారంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే రెండో క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం ఈ ఏడాది భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) ఇద్దరు క్రీడాకారుల పేర్లను ప్రతిపాదించింది. వీరిలో అమిత్ పంగ ల్, గౌరవ్ బిదూరీ ఉన్నారు. ఈ మధ్యే ముగిసిన ఆసి యా బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో సత్తాచాటిన అమిత్..గత కొంత కాలం గా నిలకడగా రాణిస్తున్నాడు. బరిలోకి దిగిన దాదాపు ప్రతి టోర్నీలో పతకంతో మెరుస్తున్నాడు. గతేడాది జరిగిన జకార్త ఆసియా క్రీడల్లో ఒలింపిక్ చాంపియన్ హసన్బోయ్ దుస్మతోవ్ను చిత్తుచేస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. వాస్తవానికి అమిత్ పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించినా..2012లో డోపింగ్ పరీక్షలో విఫలమై ఏడాది నిషేధం ఎదుర్కొవడంతో పరిగణనలోకి తీసుకోలేదు. సస్పెన్షన్ నుంచి బయటపడ్డ తర్వాత అమిత్.. కసిగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతూ వస్తున్నాడు. కామన్వెల్త్ (2018) గేమ్స్లో రజత పతకంతో పాటు పలు టోర్నీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన అమిత్..ఈసారి అవార్డు వరిస్తుందన్న ఆశతో ఉన్నానని తెలిపాడు. మరోవైపు 2017 ప్రపంచ చాంపియన్షిప్లో పతకం(కాంస్యం) గెలిచిన ఏకైక భారత బాక్సర్గా నిలిచిన గౌరవ్ బిదూరీ ప్రతిభను బీఎఫ్ఐ గుర్తించింది.