భువనగిరిలో ఘోరరోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

SMTV Desk 2019-05-01 12:19:01  buvanagiri, yadradri,

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో మైసిరెడ్డిపల్లి శివారులో బుదవారం తెల్లవారుజామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వినీత్ రెడ్డి(23స్పూర్తి, (22), ప్రణీత, (22), చైతన్య (23) అనే ముగ్గురు యువతీ యువకులు మృతి చెందారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి వారందరూ చంపాపేటకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడగా స్థానికుల సాయంతో పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం వారందరూ హైదరాబాద్‌లో ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొంటున్నారు. వారు నగరశివారులో ఒక వేడుకకు హాజరయ్యి తిరిగి వస్తుండగా దారిలో మైసిరెడ్డిపల్లి శివారులో కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న యువకుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో రాత్రిపూట అతివేగంగా కారు నడిపించడం వలననే ఈ ఘోరప్రమాదం జరిగినట్లు పోలీసులు దృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.