హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్ బోర్డు ఫలితాల విషయంలో చేసిన తప్పిదాలకు సరైన బుద్ది చెప్పి ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్ సి కుంతియా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల వెంటే ఉంటుందన, ఎవరూ అధైర్య పడొద్దని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం చేసిన ఉద్యమం విజయవంతమైందన్నారు. ప్రభుత్వం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా, నేతల్ని అరెస్టు చేసినా ప్రజలు, విద్యార్థులు పోరాటాలు చేశారన్నారు. ఇంటర్ బోర్డు వ్యవహారంలో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోగా.. ఇలా నిర్బంధించడం శోచనీయమన్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు.