ఉత్పల్ పారికర్‌కు బీజేపీ బిగ్ షాక్

SMTV Desk 2019-04-30 12:39:17  bjp, parrikar, uthpal parikar

ఇటీవల మరణించిన గోవా సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు భారతీయ జనతా పార్టీ బిగ్ షాకిచ్చింది. మనోహర్ పారికర్ మరణంతో పనాజీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ స్థానానికి బీజేపీ అభ్యర్థుని ప్రకటించింది. పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పేరుని బీజేపీ ప్రకటిస్తుందని అందరూ అనుకున్నారు . పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఉత్పల్ కూడా ప్రకటించారు. కానీ.. అనూహ్యంగా ఆ స్థానాన్ని సిద్ధార్థ్ కుంకల్యేకర్‌కు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది బీజేపీ టీం .

పనాజీ నుంచే సిద్ధార్థ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రక్షణ మంత్రిగా ఉన్న పారికర్, గోవా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కోసం సిద్ధార్థ్ తప్పుకున్నారు. ఇప్పుడా స్థానాన్ని తిరిగి ఆయనకే కేటాయిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. 2015 లో పనాజీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా సిద్దార్ద్ శ్రీపాద్ విజయం సాధించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.అయితే మనోహర్ పారికర్ కోసం సిద్దార్ద్ తన సీటు వదులుకున్నారు. మే 19న పనాజీ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి అటనాసియో మోన్సీరట్టీ పోటీలో ఉన్నారు.