హైదరాబాద్, ఆగస్ట్ 21: ఇటీవల డ్రగ్స్ దందా కేసు హైదరాబాద్ మహానగరాన్ని కుదిపేసిన సంగతి సుపరిచితమే. ఈ సంఘటన మరవక ముందే మసాజ్ సెంటర్ల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరు మసాజ్ సెంటర్లపై ఆదివారం దాడి చేయగా, మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు. కాగా, వీరిలో విదేశాలకు చెందిన 31మంది యువతులు కూడా ఉన్నారు. అయితే ఈ చీకటి కోణం వెలుగు చూడటానికి కారణం 24 ఏళ్ల కూకట్ పల్లికి చెందిన యువకుడు. ఆ యువకుడు సమాజానికి సేవ చేస్తున్నాడు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ యువకుడి ఇంట్లో రెండు పర్యాయాలు డబ్బులు దొంగిలించబడినవి. అయితే మొదటిసారి కుమారుడే దొంగతనం చేశాడని భావించి కుటుంబ సభ్యులు మందలించి ఊరుకున్నారు. రెండవ సారి అలాగే జరగడంతో కుటుంబసభ్యులు గట్టిగా నిలదీయగా మసాజ్కు వెళ్తున్నానని తెలిపాడు. కాగా, సరిగ్గా అప్పటికే డ్రగ్స్ మహమ్మారి పెను దుమారం రేకెత్తిస్తున్న నేపధ్యంలో ఈ మేరకు వివరాలందించినా సంతృప్తి చెందిని కుటుంబ సభ్యులు, అతనిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆరాతీసిన పోలీసులకు థాయ్ మసాజ్ మాటున సాగే గుట్టుచప్పుడు కాని యవ్వారం బయటపడింది. దీంతో దాడులు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.