నంద్యాల, ఆగస్ట్ 21: తెదేపా మంత్రి భూమా అఖిలప్రియపై గత కొద్ది కాలంగా నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ఆరోపణలపై ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ మంత్రిగా కొనసాగుతున్న ఆమె రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు. నాకు పదవిపై వ్యామోహం లేదు. నాకు ప్రజల అండ ఉంది. 2019లో వచ్చే ఎన్నికల్లో అది ఋజువవుతుంది. ముఖ్యమంత్రిగారు రాజీనామా చేయమని చెప్తే తక్షణమే చేస్తాను అని ఆమె ప్రకటించారు. మా తండ్రి భూమా నాగిరెడ్డిపై శిల్పా మోహన్ రెడ్డి గతంలో చాలా కేసులు పెట్టారు. భూమా ఒక బ్రాండ్.. ఆ పేరు నిలబెడతాం. ప్రతిపక్షంలో ఉండలేక టీడీపీలో చేరామన్నది నిజం కాదు. పదవి కోసం.. మా నాన్న చనిపోయిన మర్నాడే నేను అసెంబ్లీకి వెళ్లానన్నది కరెక్ట్ కాదు. మా నాన్న లక్ష్యాలేంటో చెప్పేందుకే ఆ రోజున అసెంబ్లీకి వెళ్లాను అని స్పష్టం చేశారు. నంద్యాలలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకే అర్థం కావట్లేదని ఆమె ఎద్దేవా చేశారు.