తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితపుడైన మారుతిరావు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్కుమార్, ఖరీంకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అయితే వీరు శనివారమే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ కావాల్సి ఉండగా.. బెల్ పత్రాలు సరైన సమయానికి అందక పోవడంతో ఈరోజు ఉదయం విడుదల చేశారు జైలు అధికారులు. ఈ ముగ్గురిపై 2018 సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు బెయిల్పై బయటకు వస్తే ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు.
కాగా వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మారుతిరావు, శ్రవణ్కుమార్, ఖరీం.. బెయిల్ కోసం 2 నెలల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ తర్వాత వీరికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కానీ... మారుతీరావు కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిసి వారికి బెయిల్ మంజూరు చేయడం సరికాదని ప్రణయ్ భార్య అమృత ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.