వుహాన్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ప్రారంభంలో భోని కొట్టిన భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్ ,పి.వి.సింధు, సమీర్ వర్మలు క్వార్టర్ ఫైనల్ పోటీల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఛాంపియన్షిప్లో భారత్ పోరాటం ముగిసింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సింధు మరోసారి పేలవమైన ఆటతో క్వార్టర్ ఫైనల్లో అనామక క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైంది. నాలుగో సీడ్గా బరిలోకి దిగిన సింధు క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన కాయ్ యన్యన్ చేతిలో పరాజయం చవిచూసింది. అద్భుత ఆటను కనబరిచిన యన్యన్ 2119, 219 తేడాతో సింధుపై సంచలన విజయం సాధించింది. తొలి సెట్లో కాస్త మెరుగ్గా ఆడిన సింధు తర్వాతి గేమ్లో ఘోరంగా విఫలమైంది. దీంతో అవమానకర రీతిలో ఓటమి తప్పలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో సైనా పోరాడి ఓడింది. జపాన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి అకానె యమగూచితో జరిగిన పోరులో సైనా 1321, 2321, 1621 తేడాతో ఓటమి పాలైంది. ప్రారంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన అకానె సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో కూడా భారత్కు నిరాశే మిగిలింది. భారత్ ఏకైక ఆశాకిరణంగా కనిపించిన సమీర్ కూడా క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. చైనాకు చెందిన రెండో సీడ్ షి యుకి చేతిలో సమీర్ ఓటమి పాలయ్యాడు. ఏకపక్షంగా సాగిన పోరులో యుకి 2110, 2112 తేడాతో సమీర్ను చిత్తు చేశాడు. ఈ మ్యాచ్లో సమీర్ ఏదశలోనూ ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేక పోయాడు. పేలవమైన ఆటతో ఘోర పరాజయాన్ని చవిచూశాడు.