అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి భూమి కుంగింది. ప్రాజెక్టు వద్ద 902 పాయింట్ ఏరియాలో భూమి ఒక్కసారిగా కంపించి బీటలు వారింది. ప్రాజెక్టు సమీపంలో ఉన్న రెస్టారెంట్ లోపల కూడా భయంకరంగా పగుళ్లు ఏర్పడ్డాయి. భూమి కంపించడం, పెద్ద పెద్ద పగుళ్లు రావడంతో అక్కడ పని చేస్తున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కిడ నుంచి పరుగులు తీశారు. అధికారులు కూడా యంత్రాలు, పని సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూ ప్రకంపనలు, భారీ స్థాయిలో పగుళ్లు, భూమి నెర్రలు వాయడం తదితర ఘటనలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు మాత్రం డంపింగ్ యార్డ్ వద్ద భారీ స్థాయిలో మట్టి చేరడం వల్ల బరువుకి ఇలా జరుగు తోందంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకమైన పనుల కారణంగా ఇలా జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.