అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలపై ఈసీ అడ్డు చెబుతుండటంతో... రివ్యూలపై అడ్డుచెప్పడం సరికాదని లేఖ రాశారు. అలాగే తెలంగాణతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని కార్యక్రమాలపై సమీక్షలు చేస్తున్నా.. వారికి లేని ఎన్నికల కోడ్ ఏపీలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఏపీ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షమని, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. సీఎం భద్రత చూస్తున్న ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ బదిలీలు ఏకపక్షమన్న చంద్రబాబు. వైసీపీ చేసిన ఫిర్యాదులపై విచారణ లేకుండానే బదిలీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్దికి ఆటంకం కలగించేలా ఈసీ వ్యవహరించకూడదన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఎన్నికలు, ఫలితాలకు మధ్య ఆరువారాల సమయం లేదని గుర్తు చేశారు.బదిలీలు, ఏకపక్ష నిర్ణయాలపై స్వయంగా ఈసీఐకి తెలియజేశామని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందన్నారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డారని. మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికలప్పుడు ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు టీడీపీ అధినేత.తెలంగాణతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని కార్యక్రమాలపై రివ్యూలు చేస్తున్నా. వారికి లేని ఎన్నికల కోడ్ ఏపీలోనే ఎందుకు అడ్డు వస్తుందని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, అందువల్ల పోలవరం ప్రాజెక్ట్, సీఆర్డీఏలపై సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ చేసిన ఏ ఫిర్యాదుపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని..కానీ వైసీపీ చేసిన ఫిర్యాదులపై వెంటవెంటనే నిర్ణయాలు అమలయ్యాని లేఖలో గుర్తు చేశారు. ఫిర్యాదులు చేసిన టీడీపీ నేతలను ఐటీ దాడులతో భయపెట్టారని ఆరోపించారు. సాధారణ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ప్రజలకు సంబంధించిన కీలక అంశాల్లో వ్యాఖ్యలు చేయడం సీఈవోకు తగదన్నారు. సమీక్షలపై సీఎం అధికారాలను ఆపే హక్కు ఈసీకి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు లేఖపై ఈసీ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.