న్యూఢిల్లీ: మే 30 న ప్రారంభంకానున్న ఐసిసి వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్స్ కి వెళ్ళే జట్ల గురించి భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...తన అంచనా ప్రకారం ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు సెమీస్కు చేరుతాయని అన్నారు. గతంలో జరిగిన పోటీలతో పోలిస్తే, ఈసారి మరింత ఉత్కంఠభరితంగా పోరు సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ బలంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. సులభంగా భావించే జట్లేవీ లేవని, ఏ జట్టుపైన అయినా విజయం కోసం కష్టపడాల్సిందేనని అన్నారు. కాగా, ఈ సారి వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సాగనుందన్న సంగతి తెలిసిందే. ప్రతి జట్టూ మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టాప్ 4 స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు చేరుతాయి.