సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ నోటీసులు

SMTV Desk 2019-04-25 12:09:01  sachin tendulkar, vvs lakshman, bcci, bcci ombudsman notices passes to sachin and vvs lakshman

న్యూఢిల్లీ: క్రికెట్ సంచలన ఆటగాడు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ నోటీసులు పంపించింది. వీరిద్దరూ క్రికెట్ అడ్వైజరీ కమిటీ(CAC)లో సభ్యులుగా ఉంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెంటర్స్‌(సలహాదారులు)గా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారని వస్తున్న ఆరోపణలపై ఈ నోటీసులు జారీ చేసింది. అయితే బీసీసీఐకు సేవలందిస్తోన్న సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అయినప్పటికీ నోటీసులు అందుకోవడం గమనార్హం. భారత జట్టుకు కోచ్‌ నియామకంతో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాల కోసం బీసీసీఐ కొన్నేళ్ల కిందట సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో క్రికెట్‌ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ ముగ్గురూ జీతాలేమీ తీసుకోవట్లేదు. ఉచిత సేవే చేస్తున్నారు. అయినప్పటికీ ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్రాంచైజీలకు మెంటర్స్‌గా ఉంటూ ఈ కమిటీలో ఎలా కొనసాగుతారంటూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌.. సచిన్‌, లక్ష్మణ్‌లకు నోటీసులు పంపారు. ఈ నోటీసులకు సచిన్, లక్ష్మణ్ ఈనెల 28లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఈ విషయంలో నోటీసులు అందాయి. ఆయన రిటైర్డ్ జడ్జ్ ముందు విచారణకు కూడా హాజరయ్యారు. గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) అధ్యక్షుడిగా, సీఏసీ సభ్యుడిగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలతో ఆయనకు నోటీసులు పంపారు. తాజాగా సచిన్, లక్ష్మణ్‌కు కూడా నోటీసులు అందాయి. ఈ విషయంలో బీసీసీఐ కూడా తన స్పందన తెలపాలని జైన్ కోరారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడైన సంజీవ్ గుప్తా చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ జైన్ ఈ నోటీసులు జారీ చేశారు.