బెంగళూరు: బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుపై బెంగళూరు సంచలన విజయం సాధించింది. తొలుత ఏబీ డివిలియర్స్ (82 నాటౌట్: 44 బంతుల్లో 3x4, 7x6) మెరుపు అర్ధశతకం బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా ఛేదనలో పంజాబ్ జట్టు 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 48, క్రిస్గేల్ 23, మయాంక్ అగర్వాల్ 35, డేవిడ్ మిల్లర్ 24 పరుగులతో రాణించారు. చివర్లో నికోలస్ పూరన్ (46) మెరుపులు మెరిపించినా జట్టుకు విజయాన్ని అందిచలేకపోయాడు. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఈ మధ్య కోల్కతా, చెన్నై జట్లపైనా ఆఖరి ఓవర్లో బెంగళూరు గెలిచిన విషయం తెలిసిందే. తాజా సీజన్లో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్న బెంగళూరు జట్టు తొలిసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.