గుంటూరు, ఆగస్ట్ 20: తెదేపా 2014ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఏపీ మంత్రి పితాని సత్యానారాయణ తెలిపారు. ఇప్పటికే చాలా వరకు అమలు చేశామని, నిరుద్యోగ భృతిని కూడా మరో పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని గుంటూరులోని స్థానిక హిందూ కళాశాలలో నిర్వహించిన కౌండిన్య సేవా సమితి సభలో ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ విజయరావును సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ...నిరుద్యోగ భృతి హామీపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చిస్తోందని, త్వరలోనే నెరవేరుస్తామని ఆయన చెప్పారు. నిరుద్యోగ భృతిని నగదుగా ఇవ్వాలా? లేక నైపుణ్యాభివృద్ధి రూపంలో ఇవ్వాలా? అనే విషయంపైన; ఇంకా వయసు, విద్యార్హత అంశాలపైన చర్చ జరుగుతోందని, నిరుద్యోగ భృతి హామీని రూ.500 కోట్లతో తప్పక నెరవేరుస్తామని మరో మారు ఆయన ప్రకటించారు. ఈ సభలో ఆయన ఉపాధి కల్పనా కార్యాలయాల గురించి పేర్కొన్నారు. వీటికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి, ఏపీపీఎస్సీతో ఈ శాఖను అనుసంధానం చేస్తామని తెలిపారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను మరింత చేరువచేస్తామని ఆయన ప్రకటించారు.