ముంభై: హెల్మెట్ తయారీ కంపెనీలు బీఐఎస్ నిబంధనలకు పాటించకుండా హెల్మెట్లను తయారు చేస్తూ ప్రయాణికులకు సరైన భద్రతను అందించలేకపోతున్నాయి. దేశంలో మొత్తం 219 హెల్మెట్ తయారీ కంపెనీలు ఉన్నాయి. అయితే వీటిలో కేవలం 9 అంటే 5 శాతం కన్నా తక్కువ కంపెనీలే బీఐఎస్ నిబంధనలకు అనువైన హెల్మెట్లను తయారు చేస్తున్నాయి. మిక్సర్లు, గ్రైండర్లు వంటి వాటికే బీఎస్ఐ ధ్రువీకరణ తప్పనిసరి. అయితే బైక్ హెల్మెట్లు మాత్రం ఈ నిబంధనను అనుసరించడం లేదు. అయితే త్వరలోనే కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హెల్మెట్లను బీఐఎస్ యాక్ట్ కిందకు తీసుకురావాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో నాణ్యమైన హెల్మెట్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే టూవీలర్ హెల్మెట్లకు సంబంధించి కేంద్ర బీఐఎస్ నిబంధనలను నోటిఫై చేసినట్లు తెలుస్తోంది. ‘కేంద్రం ఐఎస్ఐ హెల్మెట్లు తప్పనిసరి చేస్తూ, టూవీలర్ హెల్మెట్లకు కొత్త బీఐఎస్ నిబంధనలను ప్రకటించనుంది. జూలై 15 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రావొచ్చు. ప్రస్తుతం దేశంలో 219 హెల్మెట్ తయారీ కంపెనీలున్నాయి. వీటిల్లో కేవలం 9 మాత్రమే బీఎస్ఐ నిబంధనలు పాటిస్తున్నాయి’ అని టూవీలర్ హెల్మెట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషసన్ ప్రెసిడెంట్, స్టీల్బర్డ్ హెల్మెట్స్ ఎండీ రాజీవ్ కపూర్ తెలిపారు.