ఏపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. దేశంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలెట్టిందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని విమర్శించారు. తాజాగా జేసీ వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
అసలు విజయసాయిరెడ్డి ఏమన్నారంటే... ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు దివాకర్ రెడ్డి గారూ. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తరువాత 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రూ. 500 నోట్లు వెదజల్లిన చరిత్ర చంద్రబాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ. 20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు టీడీపీకి కర్రు కాల్చి వాత పెట్టారు అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.